మేడిగడ్డకు 2021లోనే బుంగ
సర్కారు ఆదేశాలతో గుట్టు చప్పుడు కాకుండా పూడ్చివేత
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాత్కాలిక మరమ్మతులు
పీసీ ఘోష్ కమిషన్కు ఇంజినీరింగ్ అధికారుల వెల్లడి
మంథని, జూన్ 7 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్కు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 2021లోనే బుంగ పడిందని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. నాడు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి నడిపించామని, బుంగ కింద ఏర్పడిన ఇసుకను సైతం తొలగించామని వెల్లడించారు. తరువాత యధావిధిగా ప్రాజెక్టు నిర్వహణ సాగిందని కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్కు వివరించారు. జస్టిస్ ఘోష్ శుక్రవారం మేడిగడ్డ బరాజ్ను సందరించారు. శనివారం అన్నారం బరాజ్ను సందర్శించనున్నారు.
ఈ సందర్భంగా బరాజ్లకు జరిగిన నష్టాన్ని అధికారులు ఆయనకు వివరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరో రెండు బియర్ల కింద బుంగలు ఏర్పడ్డాయని, వాటిపై సోషల్ మీడియాతో పాటు పత్రికల్లో వార్తలు రావడంతో సమస్య పెద్దదిగా మారిందని తెలిపారు. ఇదే తరుణంలో ప్రభుత్వ మారడం, విచారణతో ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్ధగా మారిందని పేర్కొన్నారు.
ఏవిధంగా మరమ్మతులు చేపట్టారనే విషయంపై ఘోష్ కమిటీ క్షుణ్ణంగా వివరాలు సేకరించింది. 2021లో జరిగిన సంఘటనను ఎందుకు బయటకు చెప్పలేదని అధికారులను ఘోష్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా మరమ్మతులు చేయాలని ఆదేశించిందని, ప్రభుత్వ ఆదేశాలను పాటించామని అధికారులు తెలిపారు. దీంతో పీసీ ఘోష్ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.






