నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
బత్తిని సోదరుల ఆధ్వర్యంలో నిర్వహణ
అతిథులుగా స్పీకర్, మంత్రి పొన్నం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి): నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని సోదరుల ఆధ్వర్యంలో నేటి నుంచి చేపమందు పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చే ప్రజల కోసం 6 లక్షల మందికి సరిపడా చేప మందును బత్తిని కుటుంబసభ్యులు సిద్ధం చేశారు. ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొనున్నట్లు బత్తిని అమర్నాథ్గౌడ్ తెలిపారు.
చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజల కోసం వైద్య, మత్స్య శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అస్తమా బాధితులు చేరుకున్నారు. నేటి(శనివారం) నుంచి రేపు ఉదయం వరకు ఎగ్జిబిషన్గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కవాడీగూడ, దూద్బౌలీలో చేపప్రసాదాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు. బత్తిని కుటుంబ సభ్యులు 180 ఏళ్లుగా ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
పోలీసులతో బందోబస్తు
చేప ప్రసాదం పంపిణీకి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 1,200 మంది పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు అబిడ్స్ ఏసీపీ ఆకుల చంద్రశేఖర్ తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పోలీసు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని చెప్పారు. సిటీ సెక్యూరిటీ వింగ్, డాగ్ స్కాడ్, బాంబ్ స్కాడ్లతో తనిఖీలు చేశామన్నారు. డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, సీసీ టీవీలను ఏర్పాటు చేస్తామన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో రెండు 108 అంబులెన్స్లు, ఆరు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
రెండు అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి ప్రజలు ప్రత్యేక వాహనాల్లో తరలి వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గృహకల్ప, గగన్విహార్, చంద్రవిహార్, మనోరంజన్ కాంప్లెక్స్, ఎంఏఎం గర్ల్స్ జూనియర్ కాలేజీలో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తినట్లుతై 90102 03626 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించాలని చెప్పారు.






