11-06-2025 01:07:45 AM
లక్షలాది మందికి కీలకమైన ప్రజారవాణా వ్యవస్థ తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ). ప్రస్తు తం ఆర్టీసీ అస్థిరత్వానికి ముప్పు ఏర్పడే స్థితి లో తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పెరుగుతున్న నష్టాలు, ప్రైవేటీకరణ గుసగుసలు, ఉద్యోగుల నిరసనలతో ఆర్టీసీ తీవ్రమైన ఇబ్బందుల్లో కనిపిస్తోంది. ఇటీవలి బస్పాస్ ఛార్జీల పెంపు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నది.
నిరంతరం ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడే ఆర్టీసీకి రాష్ర్ట ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితుల కారణంగా సంస్కరణలను ప్రవేశపెట్టాల్సిన పరిస్థితులను కలిపిస్తోంది. అయినా తెలంగాణలో ఓ పడిలేచిన కెరటం లాంటి ఉదాహరణ ఆర్టీసీని గండం నుంచి గట్టెక్కించేం దుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీవీఎన్ శర్మ నాయకత్వంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) పడిపోయే దశ నుంచి అద్భుతంగా కోలుకున్న తీరు ఆర్టీసీకి ఓ మార్గనిర్దేశంలా తోస్తోంది. సింగరేణి విజయవంతంగా నిలదొక్కుకున్న విధానం ఆర్టీసీని పతనం నుంచి కాపాడగలదా లేక కార్పొరేషన్ అసమర్థత, రాజకీయ జోక్యానికి బలయ్యే అవకాశం ఉందా..?
ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులు.. తీవ్రమవుతున్న సంక్షోభం
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి చాలా కష్టపడుతోంది. 2019 డేటా ప్రకారం నష్టాలు 2014--15లో రూ.299.64 కోట్ల నుంచి 2017--18లో రూ.748.90 కోట్లకు పెరిగాయి. ఇది 150శాతం మేర పెరిగిన నష్టాలను చూపిస్తోంది. 2020--21నాటికి కొవిడ్ 19 మహమ్మారి ఆర్టీసీని మరింత దయనీయంగా మార్చేసింది. రూ.1,603.78 కోట్ల నష్టం తో ఆర్టీసీ మరింతగా దిగజారింది.
ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 44. 36శాతం నష్టాల్లోకి వెళ్లిపోయింది. 2022లో ఆదాయం పెరిగినప్పటికీ, స్థూల ఆదాయం రూ.3,311 కోట్ల నుంచి రూ.5,879కోట్లకు చేరినా..నష్టాలు రూ.650 కోట్ల వద్ద గణనీయంగా పెరిగాయి. ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలు ఏటా రూ.180 కోట్ల రుణవడ్డీ, రూ.900 కోట్ల మేర జీతాలు, రూ.80 నుంచి-రూ.100 కోట్ల మే డీఏ అలవెన్సులు వంటివి అధిక నిర్వహణ ఖర్చులుగా మారాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల బడ్జెట్ మరింత భారం పడుతోంది. ఇది నెలకు రూ.4 కోట్ల భారంగా మారుతోందని అంచనా.
ప్రైవేటీకరణ భయాలు.. ఉద్యోగుల ఆందోళనలు
ప్రైవేటీకరణ భయం ఆర్టీసీపై ఎక్కువగా కనిపిస్తోంది. 2019లో అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, రాష్ట్రాలకు రూట్లను ప్రైవేటీకరించడానికి అధికారం ఇచ్చే మోటారు వాహన సవరణ చట్టం 2019ని కార్పొరేషన్ కష్టాలకు ఒక సాధ్యమైన పరిష్కారంగా పేర్కొన్నారు. రూ.5,000 కోట్ల సమిష్టి నష్టాలను, వార్షికంగా రూ.1,200 కోట్ల నష్టాలను అప్పుడు కేసీఆర్ ఉదహరించారు.
సంస్థ నష్టాలకు యూనియన్లు కారణంగా ఆయన నిందించారు. 2019 సమ్మె సమయంలో 1,000 ప్రైవేట్ బస్సులను నియమించుకోవాలని ప్రభుత్వం తీసుకున్న చర్య పాక్షిక ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడాన్ని సూచించింది. ఇది ఆర్టీసీలోని 48వేల మంది ఉద్యోగుల్లో భయాలను పెంచింది. ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. 2019లో ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికులను తొలగిస్తామని బెదిరించింది.
దీంతో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) వంటి ట్రేడ్ యూనియన్లు చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఈ ఏడాది ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశం విస్తృతంగా ప్రచారంలోకి రాగా..సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఈ పుకార్లను తోసిపుచ్చారు.
ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల కార్మికుల తొలగింపు సమస్య ఉండదని ఆయన హామీ ఇచ్చినప్పటికీ, సందేహం మాత్రం కొనసాగుతోంది. 2023లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అప్పటి సర్కారు నిర్ణయం..ఆర్టీసీ ఆస్తులను నిలుపుకుంటూ, భయాలను తగ్గించడానికి పెద్దగా సహాయపడలేదని చెప్పవచ్చు. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి మాత్రం ప్రమాదకరంగానే మారిపోయింది.
సింగరేణి విజయం..ఆర్టీసీకి ఆశాదీపం
ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ స్థితి నుంచి బయటపడాలంటే సింగరేణి పునరుద్ధరణ ఓ చక్కని ఉదాహ రణగా పేర్కొనవచ్చు. 1990ల చివరలో ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు పదవీకాలంలో సింగరేణి తీవ్ర నష్టాలకు గురైంది. కార్మికుల నిరసనల కారణంగా సింగరేణి మూసివేత ముప్పును ఎదుర్కొంది. సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) వంటి సంఘాల నేతృత్వంలో ఉధృతంగా సమ్మె కొనసాగి సంస్థ కార్యకలాపాలను తీవ్రంగా స్తంభింపజేసింది.
1992--94, 1996 మధ్య రెండుసార్లు కంపెనీని సిక్ యూనిట్గా ప్రకటించారు. సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్గా అత్యంత నిజాయతీపరుడైన సమర్థవంతమైన అధికారి ఏపీవీఎన్ శర్మను నియ మించారు. శర్మ పదవీకాలంలో సింగరేణికి కొత్త ఊపిరి వచ్చింది. ఆయన అన్ని స్థాయిలలో అవినీతిని నిర్మూలించి పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చా రు.
నిర్వహణ, -కార్మిక సంబంధాలను మెరుగుపరచడం ద్వారా, సంస్కరణలలో విఫలమైతే శాశ్వత మూసివేతకు దారితీస్తుందని హెచ్చరించి, ఉద్యోగులను అంకితభావంతో పనిచేసేలా ఒప్పించారు. ప్రోత్సాహకాలను ప్రవేశ పెట్టి సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించారు. కంపెనీని రాజకీయ జోక్యం నుంచి రక్షించారు. ఐదేళ్లలో నష్టా ల నుంచి సింగరేణి లాభదాయక సంస్థగా రూపాంతరం చెందింది.
2023 నాటికి దేశీయ బొగ్గు ఉత్పత్తికి 9.2 శాతం సింగరేణి అందించింది. 2020-21లో కొవిడ్ మహమ్మారి కారణంగా రూ.5,921కోట్ల నష్టం తలెత్తినా సింగరేణి బలమైన సంస్థగా రూపుదిద్దుకుంది. 2022 నాటికి ఇది 15 శాతం లాభాలను ఆర్జించింది. సంస్థ లాభాలు రూ.1,000 కోట్లకు చేరుకున్నాయి. నేడు సింగరేణి 40గనులను నిర్వహిస్తోంది. 39,856 మంది కార్మి కులను నియమించుకుంది. 1200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్తో విద్యుత్ ఉత్పత్తిలోకి అడుగుపెట్టింది.
అదనంగా 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. శర్మ అందించిన విజయం సంస్థను లాభాల్లోకి తీసుకురావడమే కాకుం డా కార్మికులు, యాజమాన్యం, ప్రభుత్వాన్ని ఒక ఉమ్మడి లక్ష్యం వైపు తీసుకువెళ్లేలా చేయడం ఆయన సామర్థ్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు. సామర్థ్యం, పారదర్శకత, ఉద్యోగులకు ప్రోత్సాహకాలతో ఆయన ఒక స్థిరమైన, విజయవంతమైన నమూనా రూపొందించారు. అప్పటి నుంచి సింగరేణి ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఆర్టీసీ పునరుద్ధరణకు ఒక రోడ్మ్యాప్..
ఆర్టీసీ మనుగడకు సింగరేణి లాంటి వ్యూహాన్ని అనుసరించడంపై ఆధారపడి ఉంది. రాష్ర్ట ప్రభుత్వం -సమగ్రత, సామర్థ్యం ఉన్న ఏపీవీఎన్ శర్మ లాంటి దార్శనికత ఉన్న నాయకుడికి ఆర్టీసీ బాధ్యతలను అప్పగించాలి. రాజకీయ జోక్యం లేకుండా సంస్కరణలను అమలు చేయడానికి కొత్తగా బాధ్యతలు చేపట్టే నాయకుడికి స్వయంప్రతిపత్తి ఇవ్వాలి. అప్పుడే ఆర్టీసీ కూడా సింగరేణి తరహాలో మందుకు సాగేందుకు అవకాశం ఉంది. అందుకు చేపట్టాల్సిన ముఖ్యమైన దశలు..
అవినీతిని నిర్మూలించడం: ఖర్చును తగ్గించి, -సమర్థత, పారదర్శకతను తీసుకురావాలి. ముఖ్యంగా అధిక ధరలున్న ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పారదర్శకంగా ఉండేలా చేయాలి.
శ్రామిక శక్తి సామర్థ్యాన్ని పెంచడం: సింగేరణిలో శర్మ చేసినట్లుగా ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచాలి. ఉత్పాదకతను పెంచడానికి పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాలి. శిక్షణ కార్యక్రమాలు, సేవా నాణ్యత, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఆర్థిక పునర్నిర్మాణం: రూ.180 కోట్ల వార్షిక వడ్డీ భారాన్ని తగ్గించడానికి రుణ నిబంధనలను సవరించాలి. 2022 నాటికి రూ.170.13 కోట్ల లాభాన్ని ఆర్జించిన ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు వంటి వినూత్న ఆదాయ మార్గాలను అన్వేషించాలి.
ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు: శర్మ విధానాన్ని అనుసరిస్తూ ఆర్థిక నష్టాలను అధిగమించేందుకు యాజమాన్యం, కార్మికులు, కార్మిక సంఘాల మధ్య సమస్యలపై సత్వరమే చర్చలు జరిగి సంస్థ లాభాల్లోకి తీసుకురావడంపై దృష్టి సారించాలి.
ఛార్జీల హేతుబద్ధీకరణ: ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచకుండా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వారి స్థోమతకు తగ్గట్లుగా ఛార్జీలు పెంచుతూ వారిని ప్రయాణించేలా ఆకట్టుకోవాలి. అంతేకానీ విద్యార్థులు, తక్కువ -ఆదాయ వర్గాలకు లక్ష్యంగా ఉన్న నెలవారీ బస్పాస్ ఛార్జీలను ఒక్కసారిగా 20 నుంచి -50శాతం పెంచడం సరైన నిర్ణయం కాదు.
ఆధునీకరణ: ఎలక్ట్రిక్ బస్సులు, బయో-మొబైల్ టా యిలెట్ల వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలను విస్తరించాలి. ప్రజలు భరించే స్థాయిలో ఉండేలా చేపట్టే చర్యల ద్వారా ఆర్టీసీ మనుగడకు అవకాశం ఉంటుంది.
మనుగడ సాధించాలంటే..
ఆర్టీసీకి ఎన్నో సవాళ్లున్నాయి. కానీ అధిగమించలేనివి కావు. సరైన నాయకత్వం, వ్యూహంతో ప్రభుత్వ రంగ సంస్థ అభివృద్ధి చెందగలదని సింగరేణి పునరుజ్జీవనం నిరూపిస్తుంది. సంస్కరణలతో విజయం సాధించే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా బాధ్యతలు అప్పగించటంతో పాటు రాజకీయ ఒత్తిళ్ల నుంచి రక్షించడం ద్వారా ప్రభుత్వం కార్పొరేషన్ను తిరిగి గొప్పగా మార్చేందుకు అవకాశం ఉంది.
ప్రభుత్వం సరైన విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం ద్వారా ప్రజలకు సేవలందించే ఓ గొప్ప సంస్థను కోల్పోవడమే కాకుండా వేలాది మంది కార్మికుల జీవనోపాధికి కూడా ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. సింగరేణి విజయగాథ మాదిరిగా నిబద్ధత, పారదర్శకత, సామర్థ్యంతో ఆర్టీసీ కూడా విజయానికి ఓ మోడల్గా మారేందుకు అవకాశాలున్నాయి. ప్రైవేట్ ప్రత్యామ్నాయం కంటే బలంగా నిలబడి లక్షలాది మందికి సేవ చేసే అవకాశమూ ఉంది. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఆర్టీసీ మనుగడ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
బస్పాస్ ఛార్జీల పెంపుతో సామాన్యులకు భారం..
తెలంగాణ, పొరుగు రాష్ట్రాలలో 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆర్టీసీ 9,232 బస్సులతో సేవలందిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జూన్ 10న ఏకంగా 20 నుంచి 50శాతం వరకు పెంచిన బస్పాస్ ఛార్జీల భారం అటు విద్యార్థులు, ఇటు నెలవారీ పాస్తో ప్రయాణించే సాధారణ ఉద్యోగులు, వివిధ వృత్తిపనివారిపై తీవ్రమైన భారంగా మారిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులకు ఇది తీవ్రఆగ్రహాన్ని తెప్పించింది.
ప్రతిపక్ష బీజేపీ సహా విద్యార్థి సంఘాలు, ఇతర పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. ఆర్టీసీ బస్పాస్ ఛార్జీల పెంపు నిర్ణయం ప్రజలపై భారం పడుతుందని విమర్శిస్తున్నారు. నిర్మాణాత్మక సంస్కరణలు లేకుండా ఈ ఛార్జీల పెంపుతో ఆర్టీసీ సగటు ప్రయాణికులకు దూరంగా మారుతుందని..సంస్థకు ఇది మంచిది కాదని విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రభుత్వ నిధులు.. పరిమిత జీవనాధారం
ఆర్టీసీ నష్టాల నుంచి నిలదొక్కుకునేందుకు సర్కారు అందిస్తున్న సాయం ఏమాత్రం సరిపోని విధంగా పరిస్థితి మారిపోయింది. 57 ప్రభుత్వరంగ సంస్థలలో పోటీ ఆర్థిక ప్రాధాన్యాల్లో ఆర్టీసీ పరిమితంగా మారింది. 2018లో ఉద్యోగులకు 16శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకే రూ.200 కోట్ల వార్షిక భారంగా మారింది. ఇది ఉద్యోగుల సంక్షేమాన్ని ఆర్థిక బాధ్యతతో సమతుల్యం చేయడంలో సవాల్గా మారిపోయింది.
3,038 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇటీవల ఆమోదించడం ఆర్టీసీ నిబద్ధతను సూచిస్తున్నా..వ్యవస్థాగత అసమర్థతలను పరిష్కరించ కుండా ఎన్ని నియామకాలు చేపట్టినా లాభం లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. రాజకీయ జోక్యం, అధిక ధరలతో కొనుగోళ్లు (ఎలక్ట్రిక్ బస్సులతో సహా) ఆలస్యపు నిర్ణయాలు కార్పొరేషన్ మనుగడను మరింత దిగజారుస్తున్నాయి.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి