కారు కకావికలం
ఓటములపై ఆత్మ విమర్శ లేకనే ఈ పరిస్థితి
తప్పులు సరిదిద్దుకుంట భవిష్యత్తు ఆశాజనకమే
కేసీఆర్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితేనే ఫలితం
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): తెలంగాణ కోసం, తెలంగాణ వలన, తెలంగాణ చేత అన్నట్టుగా మొన్నటివరకు చక్రం తిప్పిన భారత రాష్ట్రసమతి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారి ఒక ఎన్నికల్లో అసలు ఖాతా తెరులేని దుస్థితి దాపురించింది. మంగళవారం వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది.
రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చెరో ౮ సీట్లు పంచుకున్నాయి. హైదరాబాద్లో ఎంఐఎం తన పట్టును నిలుపుకున్నది. దీంతో బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. గత ఏడాది నవంబర్, డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చతికిలపడిన బీఆర్ఎస్.. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో కాస్త తేరుకొన్నట్టే కనిపించింది. కనీసం మూడునాలుగు సీట్లునా గెలుచుకుంటామనే ధీమాను వ్యక్తంచేసిన పార్టీ శ్రేణులను.. ఫలితాలు ‘సున్నా’ రావడంతో తీవ్రంగా కలిచివేసింది.
తప్పులు ఎక్కడ జరిగాయి?
నిజానికి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కసీటు కూడా గెలవకపోవడానికి ఇప్పటికప్పుడు చేసిన తప్పులు ఏమీ లేవు. అసలు ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి? రాజకీయంగా ఏమేం తప్పటడుగులు వేశాం? ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడానికి కారణాలేమిటనేది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాతనైనా బీఆర్ఎస్ అధినాయకత్వం సమీక్షించుకున్న దాఖలాలు లేవు. ప్రజలు తప్పుడు నాయకులను, పార్టీని ఎన్నుకున్నారని, బీఆర్ఎస్ను ఓడించి ప్రజలే తప్పు చేశారని పదేపదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ, ప్రజలు తమకు ఎందుకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గారనేదానిపై అంతర్గతంగా చర్చిస్తే బావుండేది.
అసెంబ్లీకి, లోక్సభ ఎన్నికలకు మధ్యన ఉన్న 5 నెలల కాలంలో ఈ తప్పుల్ని సవరించుకుని ఉంటే బీఆర్ఎస్కు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదేమో. ఇప్పటికైనా తప్పొప్పులను సవరించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. అలా చేస్తేనే ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వెంట నడిచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడు నెలల్లోనే ప్రజల్లో అసంతృప్తి కనపడుతోంది. దానిని ప్రతిపక్ష పార్టీగా తనకు అనుకూలంగా మార్చుకోవటంలో బీఆర్ఎస్ విజయం సాధించలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.






