ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వనందుకు భర్తపై కేసు
విచారణపై స్టే విధించిన కర్ణాటక హైకోర్టు
బెంగళూరు, ఆగస్టు 23: ప్రసవం తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్తో మాంసం తిననివ్వనందుకు భార్య తన భర్తతో పాటు అత్తమామలపై గృహహింస (బీఎన్ఎస్ 498ఏ) కేసు పెట్టింది. ఈ కేసు గురువారం కర్ణాటక హైకోర్టు బెంచ్కు రావడంతో వెలుగులోకి వచ్చింది. ‘నా క్లుంట్ యూఎస్లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ఫిర్యాదు కారణంగా అతడిపై లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ అయింది. దీంతో ఆయన తిరిగి యూఎస్ వెళ్లలేకపోతున్నాడు’ అని భర్త తరఫు న్యాయవాది భూషణ్ వాదించాడు. ‘ఆరేళ్ల పాటు మా కాపురం అమెరికాలోనే సాగింది.
నా భార్య ఎప్పుడూ ఇంటి పనులు చేసేది కాదు. అన్ని పనులు నేనే చేసుకునే పరిస్థితులు ఉండేవి. ఆమె ఎప్పుడూ మొబైల్ను చూస్తూ గడిపేది’ అని భర్త తన గోడు వెళ్లబోసుకున్నాడు. వారి వాదనలు విన్న జస్టిస్ నాగప్రసన్న స్పందిస్తూ.. ‘ఈ వివాదం చాలా చిన్నది. పిటిషనర్ భర్తపై ఎల్వోసీ జారీ అయ్యేలా చేసి చట్టాన్ని దుర్వినియోగం చేశారు’ అని వ్యాఖ్యానించారు. భర్తపై జరుగుతున్న అన్ని విచారణలపై స్టే విధిస్తున్నామని ప్రకటించారు. గతంలోనే కోర్టు భర్త తల్లిదండ్రుల విచారణపై స్టే విధించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త విచారణకు సహకరిస్తానని వ్యక్తిగతంగా హామీ ఇవ్వడంతో అతడికి అమెరికా వెళ్లేందుకూ అనుమతి ఇచ్చారు.






