మత్స్యకారులకు అన్యాయం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్
గణపురం, ఆగస్టు 9 (విజయ క్రాంతి) : మత్స్యకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. ఆదివారం మండలంలోని గణపురం, చెల్పూర్ చెరువులను అరవింద్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వాలు సరైన పథకాలు, హక్కులు అందించడంలో విఫలమవుతున్నాయని అన్నారు. ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంలో లోపాలు ఉన్నాయని, నగదు రూపంలో ఇస్తే మత్స్యకారులు నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకోగలరని తెలిపారు.
వలలు, పడవలు, జీవరక్షణ జాకెట్లు అందించడంతో పాటు బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు రుణాలు, పథకాలపై అవగాహన కల్పించాలని కోరారు. మత్స్యకారులకు అన్యాయం చేస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.






