27 March, 2026 | 4:49 AM

చీమ శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలి

27-03-2026 02:36 AM

టీయు జేఏసీ మహిళా ఉద్యమకారుల వేదిక డిమాండ్

ముషీరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మహిళా విభాగం నేతలపై టీయూ ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కితీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని టీయూ జేఏసీ మహి ళా విభాగం కన్వీనర్ బకారం లావణ్య డిమాండ్ చేశారు. లేకపోతే ఆయనకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో ఇలాం టి వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్‌ను హెచ్చరించడం జరిగిందన్నారు.

అయినప్పటికీ ఆయన బుద్ధి మారడం లేదని విమర్శించారు. తమ ను సావిత్రిబాయి లాగా చూడాలని, కానీ పూలాన్ దేవిలాగా మార్చవద్దని సూచించారు. టీయూ జేఏసీ ఒక సముద్రం అని దాని శక్తి చీమకు తెలియదని మండిపడ్డారు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే శ్రీనివాస్ కు తమను విమర్శించే నైతిక హక్కు లేదని వాఖ్యానించారు. మహిళలను అగౌరవపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన చీమ శ్రీనివాస్ ను మాదిగ కులం నుండి వెలి వేయాలని మాదిగ పెద్దలకు విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమ సంఘాలన్నింటిని ఏక తాటిపైకి తీసుకువచ్చి ఉద్యమం నుండి శ్రీనివాస్ ను బహిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ మహిళా విభాగం నేతలు ఎస్.అంజలి, బాలలక్ష్మి, ఇందిర, కర్ణ, లక్ష్మి, మాధవి, వరలక్ష్మి, ఉమా శ్రీ, లక్ష్మీకాంత, కవిత, విజయ, ఓగిరాల సుజ్జి, లక్ష్మమ్మ, రాణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.