28-01-2026 12:48:10 AM
రఘనాథపాలెం/ఖమ్మం, జనవరి 27(విజయక్రాంతి): ఏదులాపురం మున్సిపాలిటీ : అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) భరోసానిచ్చింది. ఏదులాపురం మున్సిపాలిటీ రెండో వార్డుకు చెందిన షేక్ అన్వర్ పాషా కుమారుడు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం భారీగా ధనం వెచ్చించారు.
ఈ విషయాన్ని స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు మహేష్.. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేయించారు. మంత్రి సిఫారసుతో ప్రభుత్వం నుంచి రూ.2,20,000 మంజూరయ్యాయి. మంగళవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇన్ఛార్జి తుంబూరు దయాకర్రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారుడు అన్వర్ పాషా ఈ చెక్కును అందుకున్నారు. కష్టకాలంలో తమ కుటుంబాన్ని ఆదుకున్న మంత్రికి, సహకరించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.