చిన్నారులూ హెల్మెట్ ధరించాలి
ప్రభుత్వ ఉన్నతాధికారులు
జూబ్లీహిల్స్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): చట్టప్రకారం నాలుగు సంవత్సరాలు నిండిన చిన్నారులు కూడా ద్విచక్రవాహన ప్రయాణంలో హెల్మెట్ ధరించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు అన్నారు. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద బుధవారం పిల్లల రోడ్డు భద్రతా దినోత్సవం పురస్కరించుకొని అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిచందన, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న చిన్నారులకు అధికారులు ఉచితంగా హెల్మెట్లను, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. రోడ్లు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, ఏసీపీ చంద్రకుమార్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






