ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
హనుమకొండ,(విజయక్రాంతి): ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 314 మంది చిన్నారులను పని నుండి విముక్తి కలిగించినట్లు వరంగల్ పోలీస్ కమీషనర్ ఎన్.శ్వేత తెలిపారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో వివరాలను వెల్లడిస్తూ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ గత నెల జులై 1వ తారీకు నుండి 31వరకు చేపట్టిన 'ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను రక్షించబడ్డారని, ఇందులో 269 మంది బాలురు, 45 మంది బాలికలు ఉన్నారు.
ఈ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నిబంధనల ప్రకారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని పారిశ్రామిక ప్రాంతాల్లో, షాపుల్లో, ఇటుక బట్టిలలో, ప్రమాదకర ప్రాంతాల్లో వరంగల్ పోలీస్ కమిషనరెట్ పరిధి లోని (9) సబ్ డివిజన్ పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేసి, ఆ టీమ్స్ కు ఇంచార్జిగా (9) ఎస్సైలు (36) మంది సిబ్బందిని నియమించి, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్ సిబ్బందితో పాటు వరంగల్ హనుమకొండ జనగాం జిల్లాలకు చెందిన బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, కార్మిక శాఖ అధికారులు, షేర్, స్కోప్, FMM SSS స్వచ్ఛంద సంస్థల సిబ్బంది సహకారంతో బాల కార్మికులుగా మగ్గుతున్న 226 మందిని, బడి మానేసిన (డ్రాపౌట్స్) 85 మందిని, సురక్షితంగా ఆపరేషన్ ముస్కాన్ టీం రక్షించి, వీరిని వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ కమిటీల ముందు హాజరు పరిచి, పిల్లలకు మరియు వారు తల్లి తండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించాం.
వీరిలో తెలంగాణేతర రాష్ట్రాలైన బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు అస్సాం రాష్ట్రాలకు చెందిన 130 మంది చిన్నారులు కూడా ఉన్నారని కమీషనర్ వివరించారు. నిబంధనలను ఉల్లంఘించి చిన్నారులతో పని చేయిస్తున్న యజమానులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 55 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసినట్లు మరియు 92 ఐఆర్ లు కార్మిక శాఖ అధికారులు చేత నమోదు చేపించామని, అలాగే వివిధ పోలీస్ స్టేషన్స్ లోని జనరల్ డైరీస్ లో 118 మంది పిల్లల వివరాలను నమోదు చేపించామని కమీషనర్ తెలిపినారు.
అనంతరం కమీషనర్ మాట్లాడుతూ "పిల్లలు బడిలో ఉండాలి కానీ పనిలో కాదనీ,బాల్యానికి అండగా నిలవడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవు," అని హెచ్చరించారు. చిన్నారుల హక్కులను కాపాడటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమీషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మహిళా, శిశు సంక్షేమ శాఖ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లతో పాటు షేర్, స్కోప్, ఎఫ్ఎంఎంఎస్ఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థలు , చైల్డ్ లైన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






