calender_icon.png 3 June, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి

08-05-2025 12:00:00 AM

  1. ఏసీలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు, దట్టమైన పొగ 

ఊపిరాడకపోవడంతో దుర్మరణం

రాజేంద్రనగర్, మే 7 : ఏసీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో మంటలు చెలరేగి చట్టమైన పొగ రావడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ పోరేటి వీరేందర్ రెడ్డి మృతి చెందారు. ఈ సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని  పుష్పలగూడ శ్రీనగర్ కాలనీలో ఉన్న కుతుబ్ ఆర్కేడ్ అపార్టుమెంట్లో ఫ్లాట్ నెం.301లో ప్రముఖ కొరియోగ్రాఫర్ పోరేటి వీరేందర్ రెడ్డి (38) నివాసముంటున్నారు.

ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు వీరేందర్ రెడ్డి పడక గదిలో ఉన్న ఎయిర్ కండిషనర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ కూడా అలుముకుంది. ఈ సమయంలో అపార్టుమెంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు పోరేటి ప్రకాశ్ రెడ్డి, విజయ దంపతులు, పెద్ద కొడుకు పోరేటి ప్రకాశ్ రెడ్డి పిల్లలు మౌతిక, నిషాంత్ రెడ్డి మరో గదిలో నిద్రిస్తున్నారు.

మంటలు భారీగా చెలరేగడంతో   గమనించిన పొరుగువారు వెంటనే స్పందించి డయల్ 100, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గదిలో అపస్మారక స్థితిలో ఉన్న   వీరేందర్ రెడ్డిని బయటకు తీసుకొచ్చి సిపిఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించారని వైద్య సిబ్బంది ధృవీకరించారు.

ఈ అగ్నిప్రమాదంలో ఫర్నిచర్, దుస్తులు, గృహోపకరణాలు, ఇతర పత్రాలు భారీగా దెబ్బతిన్నాయి. పోరేటి వీరేందర్ రెడ్డి మృత దేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ప్రముఖ చిత్రాలకు కొరియోగ్రఫీ 

 అగ్ని ప్రమాదంలో మృతి చెందిన పోరేటి వీవేందర్ రెడ్డి పలు ప్రముఖ చిత్రాలకు కొరియోగ్రఫీ చేసినట్లు సమాచారం. ఆయన మృతితో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు స్నేహితులు కన్నీరుగా విలపిస్తున్నారు.