సెల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్ పనులు వేగవంతం చేయాలి
టెలికాం సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ కె .హరిత ఆదేశాలు
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లాలో టెలికాం సేవలను మరింత మెరుగుపరిచేందుకు సెల్ టవర్ల నిర్మాణం, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కె . హరిత సంబంధిత అధికారులకు, టెలికాం సంస్థల ప్రతినిధులకు సూచించారు.శుక్రవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలతో పాటు మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన మొబైల్, ఇంటర్నెట్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో డిజిటల్ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నందున టెలికాం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.జిల్లాలో ఇప్పటికే మంజూరైన సెల్ టవర్ల నిర్మాణం, ఫైబర్ నెట్వర్క్ విస్తరణ పనుల పురోగతిని సమీక్షించి, భూ సమస్యలు, అనుమతులు తదితర అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు నిరంతరాయంగా కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు టెలికాం సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఏడి సర్వేల్యాండ్ రికార్డ్స్ వినయ్, బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ తదితర టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.






