13-01-2026 10:14:44 AM
మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీన మహబూబ్నగర్ జిల్లాకు విచ్చేసి, సుమారు 1200 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఐఐఐటి (IIIT) కళాశాల నిర్మాణం, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, శాశ్వత తాగునీటి సరఫరా, ఎంవిఎస్ కళాశాల భవన నిర్మాణం వంటి అత్యంత కీలక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ కార్యక్రమాలు మహబూబ్నగర్ జిల్లా విద్యా, మౌలిక వసతుల అభివృద్ధికి మైలురాయిగా నిలవనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లు, భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, జిల్లా స్థాయి అధికారులు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని, సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. సభా ప్రాంగణం, వేదిక ఏర్పాట్లు, రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, పారిశుధ్య చర్యలు, భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనతో మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి మరింత ఊతం లభించనుందని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను కోరారు.
సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులు ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు సమర్పించగా, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశం అనంతరం, ఐఐఐటి కళాశాల నిర్మాణం చేపట్టనున్న చిట్టబోయినపల్లి ప్రాంతాన్ని, అలాగే ముఖ్యమంత్రి సభ నిర్వహించనున్న ఎంవిఎస్ కళాశాల ప్రాంగణాన్ని ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి స్థల పరిశీలన చేశారు.