28-05-2025 09:40:00 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ అతి త్వరలో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) అన్నారు. ఇప్పటికే జిల్లాలో 32,086 మంది రైతుల నుంచి 1,33,626 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇది గత సంవత్సరం తో పోలిస్తే 349 మెట్రిక్ టన్నులు అదనమని అన్నారు. జిల్లాలో రైతుల నుంచి ప్రతిరోజు దాదాపుగా 7 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు తెలిపారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేసినప్పటికీ, ఇప్పటివరకు 1.68 లక్షల మెట్రిక్ టన్నులు నమోదు కావడం గర్వకారణమని తెలిపారు. ఇది 15.86 శాతం పెరుగుదలగా నమోదు అయిందన్నారు.
గతంతో పోల్చితే రైతుల సంఖ్యలో కూడా భారీగా వృద్ధి జరిగిందని చెప్పారు. 2024లో 29 వేల 979మంది రైతులు ధాన్యాన్ని అమ్మగా, ఈ ఏడాది 32 వేల 86 మంది రైతులు ధాన్యం విక్రయించడంతో 7.02% వృద్ధి నమోదయిందని చెప్పారు. రైతులకు వరి ధాన్యం కొనుగోలు లో ఇబ్బందులు తలెత్తితే ఫిర్యాదులు చేయడానికి 9182958858 నంబర్ ను ఏర్పాటు చేశామన్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని మొత్తాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనంగా కూలీలను, ధాన్యాన్ని తరలించేందుకు లారీలను సమకూరుస్తామని అన్నారు. అధికారులంతా నిరంతరం కొనుగోలు కేంద్రాలలో ఉండి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రైతులెవరు వరి ధాన్యం కొనుగోలుపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ధాన్యం కొనుగోలుపై ఎటువంటి అవాస్తవ పుకార్లను నమ్మవద్దని కలెక్టర్ సూచించారు.