ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాచలం, (విజయక్రాంతి): భద్రాచలం లో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీరామనవమి, 28న మహా పట్టాభిషేకం ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్ భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్టతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ఉత్సవాలకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లలో వేగం పెంచాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రవాణా వంటి మౌలిక సదుపాయాలు ఎటువంటి లోపాలు లేకుండా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన భూమి పూజ, శిలాఫలకం ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పనులలో ఆలస్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న గ్యాలరీలు, వేదికలు, భక్తులకు కూర్చునే సదుపాయాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పార్కింగ్, వైద్య సదుపాయాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఉత్సవాల సమయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించగలమని, ప్రతి అధికారి బాధ్యతతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఈ పరిశీలనలో శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ, దేవస్థానం ఈవో దామోదర్ రావు, తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, పంచాయతీ ఈవో,వివిధ శాఖల అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.




