ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో, జిల్లాలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల వారి జిల్లాలో ఇప్పటి వరకు పూర్తిచేసిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని అన్నారు.
అందుబాటులో లేని రైతులకు సంబంధించి వివరాలను వివిధ మార్గాల్లో అన్వేషించాలని సూచించారు. రిజిస్ట్రీ ప్రక్రియలో ఏవైనా సాంకేతిక సంబంధమైన ఇబ్బందులు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ మొత్తం ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఇతర అధికారులు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






