28-05-2025 10:03:35 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో పంచాయతీ కార్యదర్శులదే కీలకపాత్ర అని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో స్వచ్ఛ భారత్ మిషన్ అగా ఖాన్ పౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సెర్ప్ ఎపీఎం, ఉపాధి హామీ పథకం, ఎపీఎం, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ఒక్కరోజు అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ పంచాయితీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమన్నారు.
ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేపట్టడం, తడి చెత్త, పొడి చెత్తలు సేకరించడం, మురికి నీరు నిలువ లేకుండా చర్యలు, రహదారుల శుభ్రత, ప్రతి ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం, మురుగు కాలువల శుభ్రత, స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా, బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో వినియోగించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయవచ్చని, ఆదిశగా ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని వెల్లడించారు.
ఇందు కొరకు స్వచ్ఛభారత్ మిషన్ అగా ఖాన్ ఫౌండేషన్ సహకారంతో ముందుకు వెళ్లాలని, మంచినీరు వృధా కానివ్వకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, సామాజిక గుంతల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, ఎస్. ఐ. ఆర్. డి. రాష్ట్ర సమన్వయకర్త సుభాష్, యూనిసెఫ్ ప్రతినిధి మహాలక్ష్మి, రాష్ట్ర శిక్షకులు రమేష్, అగా ఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు నజీర్, సెల్వరాజ్, కిరణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.