28-05-2025 09:58:05 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను(Telangana State Formation Day Celebrations) అధికారులు సమన్వయంతో కృషి చేసి ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(Collector Venkatesh Dhotre) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, డీఎఫ్ఓ నీరజ్ కుమార్, కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఎ.ఎస్.పి. చిత్తరంజన్, ఆర్టీవో లోకేశ్వర్ రావులతో కలిసి ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
కలెక్టరేట్ భవనాన్ని విద్యుత్ దీప కాంతులతో సుందరీకరించాలని, చిల్డ్రన్ పార్క్ లో గల అమరవీరుల స్థూపాన్ని ముస్తాబు చేయాలని, వేదికను పూలతో అలంకరించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని ఆదేశించారు. వేడుకల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీరు, పారిశుద్ధ్యం, ప్రముఖులు, ప్రెస్ గ్యాలరీ ఏర్పాటు పనులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. వేడుకలకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలను వేడుకలకు ఒక రోజు ముందే విద్యుత్ కాంతులతో ముస్తాబు చేయాలని తెలిపారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని, వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో వేడుకల నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.