30-05-2025 12:05:46 AM
- డిగ్రీలో అత్యధికంగా ఆ కోర్సునే ఎంచుకున్న విద్యార్థులు
- ఆ తర్వాత ఫిజికల్ సైన్స్, లైఫ్సైన్సెస్ కోర్సులు
- తొలి విడత దోస్త్ సీట్లు కేటాయింపు
- మొత్తం 3.71లక్షల సీట్లలో 60,436సీట్లు భర్తీ
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): డిగ్రీలో ప్రతీఏటా కామర్స్ కోర్సుదే హవా కొనసాగుతోంది. ఆ కోర్సునే విద్యార్థులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఆ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగవకాశాలు ఎక్కువగా ఉండటంతో కామర్స్ కోర్సుకు క్రేజ్ ఎక్కువగా ఉంటోంది.
ఫిజికల్ సైన్సెస్ (భౌతికశాస్త్రాలు), లైఫ్సైన్సెస్ (జీవశాస్త్రాలు), ఆర్ట్స్ తదితర కోర్సుల కంటే కూడా కామర్స్ కోర్సుకే డిమాండ్ విపరీతంగా ఉంది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) మొదటి విడత సీట్లను గురువారం మాసాబ్ట్యాంక్లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయం లో చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొ.పురుషోత్తం, మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ కలిసి ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా దోస్త్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మినహా మొత్తం 805 కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం 3,71, 096 సీట్లు ఉన్నాయి. అయితే తొలివిడతలో 60,436సీట్లను విద్యార్థులకు కేటా యించారు. ఇంకా 3,10,660సీట్లు మిగిలాయి. ఫస్ట్ ఫేజ్లో మొత్తం 65,191మంది విద్యార్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. 60,436మంది అభ్యర్థుల్లో 21,758 మంది కామర్స్ గ్రూపునే ఎంచుకున్నారు. 15,249 మంది ఫిజికల్ సైన్సెస్, 11,005 మంది లైఫ్సైన్సెస్ను ఎంచుకున్నారు.
ఆర్ట్స్ గ్రూపును చాలా తక్కువ మంది ఎంచుకున్నారు. కేవలం 5,986మంది మాత్రమే ఆ కోర్సు ను ఎంచుకున్నారు. ఇక ఇతరత్రా కోర్సులను 6,438 మంది ఎంపిక చేసుకోవడం గమనార్హం. దోస్త్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 886 కాలేజీలుంటే (రెసిడెన్షియల్ మినహా) అందులో మొత్తం 3,84, 748 సీట్లకుగానూ తొలివిడతలో 76,290 సీట్లు భర్తీ అయ్యాయి.
ఆ ఏడాదిలోనూ 28,655 (37.56 శాతం) మంది అభ్యర్థులు కామర్స్ గ్రూపునే ఎంచుకోగా, 2023 లోనూ ఫస్ట్ ఫేజ్లో కామర్స్ గ్రూపును 33,251(45.41 శాతం)మంది అభ్యర్థులు ఎంచుకోవడం విశే షం. గతేడాది కంటే ఈసారి తొలివిడతలో సీట్ల కేటాయింపు తగ్గింది. కామర్స్ గ్రూపు ఎంచుకుంటున్న వారి సంఖ్య కూడా గత మూడేళ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తోంది.
నేటి నుంచి ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ
రెండో విడత సీట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ ప్రక్రియను జూన్ 9 వరకు చేపట్టనున్నారు. జూన్ 13న తేదీన రెండో విడత సీట్లను కేటాయించనున్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 30 నుంచి జూన్ 6 వరకు ఆయా కాలేజీల్లో సీటును రిజర్వ్ చేసుకోవాలి.
సీట్లు పొందిన వారిలో అమ్మాయిలే ఎక్కువ..
దోస్త్ తొలివిడతలో 60,436మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. డిగ్రీలో సీట్లు పొందిన వారిలో అబ్బాయిలు 22,395 మంది ఉంటే, అమ్మాయిలు ఏకంగా 38,041మంది ఉండడం గమనార్హం.
గతేడాదిలోనూ అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది. గతేడాదిలో తొలివిడత సీట్ల కేటాయింపులో అబ్బాయిలు 28,423 (37.26 శాతం)మంది ఉంటే, అమ్మాయిలు అత్యధికంగా 47,867 (62.74 శాతం) మంది ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో ఫ్యాకల్టీ వైస్గా నాలుగు గ్రూపుల్లో కలిపి 20మంది టాపర్లలో 19 మంది అమ్మాయిలుంటే, కేవలం ఒక్కరే అబ్బాయి ఉన్నారు.
2024లోనూ ఒక్కరే అబ్బాయి ఉండడం విషేశం. ఒక్క సీటు కూడా కేటాయించని కాలేజీలు 74 ఉన్నాయి. ఇందులో ఒకటి ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉండగా, మిగతావి ప్రైవేట్ కాలేజీలున్నాయి. గత మూడేళ్లలో జీరో సీట్లు ఉన్న కాలేజీలను తొలగించేశారు. అవి దాదాపు 80 వరకు ఉన్నట్లు తెలిసింది.
ఇంగ్లిష్ మీడియానికే మొగ్గు
డిగ్రీ కోర్సులు చేస్తున్న అభ్యర్థులు ఇంగ్లిష్ మీడియాన్నే ఎం చుకుంటున్నారు. తెలుగు మీడియంలో డిగ్రీల కు ఆదరణ తగ్గడం తో అటువైపు మొగ్గు చూపడంలేదు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నే ఉద్యోగ అవకాశాలుండటంతో ఇంగ్లిష్ మీడియం చదువులకే మొ గ్గుచూపుతున్నారు.
ఈక్రమంలోనే దోస్త్ 2025లో సీట్లు పొందిన 60,436 మందిలో ఇంగ్లిష్ మీడియాన్ని ఎం చుకున్న వారు 58,575 మంది కాగా, తెలుగు మీడియాన్ని ఎంచుకున్నది కేవలం 1,552 మాత్రమే. హిందీ మీడియాన్ని ఎవరూ ఎంపిక చేసుకోలేదు. ఇక ఉర్దూ మీడియాన్ని 309 మంది విద్యార్థులు ఎంచుకున్నారు. మిగిలిన సీట్లను రెండు, మూడు, తుది విడతల్లో భర్తీ చేయనున్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి తెలిపారు.