08-02-2026 06:38:10 PM
* మేడ్చల్ నియోజకవర్గ సీపీఐ పార్టీ ఇంఛార్జ్ తోటపల్లి శంకర్
జవహర్ నగర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని మేడ్చల్ నియోజకవర్గ సీపీఐ ఇంఛార్జ్ తోటపల్లి శంకర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ లోని దళిత సంక్షేమభవన్ లో కాప్రా మండల సీపీఐ కార్యదర్శి దర్శనం యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం దేశవ్యాప్త సమ్మెపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తోటపల్లి శంకర్ హజరై మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణతో ఉద్యోగాలు కోల్పోవడం కార్మికుల హక్కులను హరించడమేనని, కార్పొరేట్ బడాబాబుల కోసమే ప్రధాని మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఉద్యమాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ నెల 12న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక, ప్రజా సంఘాలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నర్సింహాలు, శ్యామల లత. స్వరూప, ఎల్లయ్య, సత్యంసాగర్, మల్లిక, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.