21-09-2025 11:48:56 PM
- అశోక్ సార్ నిరాహారదీక్ష విరమించాలి
- వనస్థలిపురం ఏరియా దవాఖానలో అశోక్ సార్ ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
ఎల్బీనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. చైతన్యపురిలో పోటీ పరీక్షల నిపుణుడు అశోక్ తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఆరోగ్యం క్షీణిస్తుందని అశోక్ ను పోలీసులు వనస్థలిపురం ఏరియా దవాఖానలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శనివారం రాత్రి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదివారం ఉదయం అశోక్ ని పరామర్శించారు. ఆసుపత్రిలో 7 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న అశోక్ ని వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
కాగా, మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వేర్వేరుగా మాట్లాడారు. అశోక్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని, వెంటనే నిమ్స్ హాస్పిటల్ తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేపడతామని హెచ్చరించారు. నిరుద్యోగుల కోసం పోరాడుతున్న వ్యక్తి ఆరోగ్యంపై ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రభుత్వం వెంటనే రీకండక్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రీ కండక్ట్ చేసి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూపు 1 అభ్యర్థుల కోసం నీరుద్యోగుల పక్షాన ఎప్పుడు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ వెంట బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ అసెంబ్లీ ఇంచార్జి సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు లచ్చిరెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.