calender_icon.png 31 October, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఆపద మొక్కులు!

31-10-2025 01:10:17 AM

  1. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ కోల్పోతేనే హామీలు అమలవుతాయి
  2. రెండేళ్ల తర్వాత క్షేత్రస్థాయి వాస్తవాలను కాంగ్రెస్ గ్రహించింది
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు.

అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతున్నదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనమని తెలిపారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన డిపాజిట్‌ను కోల్పోయేలా ప్రజలు చేసినప్పుడు మాత్రమే 2023లో వారు ఇచ్చిన ఆరు హామీలు, 420 వాగ్దానాలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రారంభిస్తుందని వివరించారు. కాంగ్రెస్, దాని నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సరైన వేదిక కావాలి అని అన్నారు.