చైర్మన్ పదవిపై కాంగ్రెస్ నేతల కన్ను
ఎమ్మెల్యేతో సంప్రదింపులు.. పదవి ఎవరికి ఫలించెనో దేవరకద్ర నియోజకవర్గం అంతా ఇదే చర్చ
దేవరకద్ర, జూలై 19 : దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రస్తుత పాలకవర్గం పదవి కాలం ముగియనుండటంతో ఉత్కంఠ నెలకొంది. పదవి కాలం ముగిసిన అనంతరం కొత్త చైర్మన్ తో పాటు పాలకవర్గాన్ని నియమిస్తారా? ప్రస్తుత పాలకవర్గాన్ని కొనసాగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.పదవి కోసం పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎవరికీ అవకాశం కల్పిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
చైర్మన్ పీఠం కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కీలకమైన ఈ పదవిని దక్కించుకునేందుకు పలువురు నాయకులు ప్రయత్నాలు ముమ్మరంగా చేయగా, కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నాయకుడు కౌకుంట్ల కిషన్ రావు చైర్మన్ పదవి రేసులో ముందంజలో ఉన్నట్లు అటు కార్యకర్తలు, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు పదవులు దక్కాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.






