08-12-2025 05:51:33 PM
* బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి..
* మళ్లీ మోసపోవద్దు..
* బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి..
పాపన్నపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు ప్రజలు మరోసారి మోసపోవద్దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్, వార్డ్ స్థానాలకు బరిలో ఉన్న అభ్యర్థులతో ప్రచారం నిర్వహించారు. కొడపాక సర్పంచ్ అభ్యర్థి గౌరీగారి పంకజ కాశీనాథ్, శేరిపల్లి లావణ్య నర్సింలు, బాచారం సొంగ పవిత్ర దుర్గయ్య తరుపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలున్నాయని గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు కానీ పట్టణాల్లో ఎన్నికలు లేవని మహిళలకు ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసమే చీరలను అందించిన విషయాన్ని మహిళలు గ్రహించాలని కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలను ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు.
ఈ ప్రభుత్వం రెండేళ్లలో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల క్రితం మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లను దండుకొని ఆ తర్వాత మొండి చేయి చూపిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ప్రజలను వంచిందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఈ సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ ప్రచారంలో కొడపాక మాజీ సర్పంచ్ లు సంగప్ప, వెంకట్ రాములు, మాజీ ఎంపీటీసీ చారి, నాయకులు దుర్గయ్య, దత్తు, శ్రీనివాస్ గౌడ్, బాలయ్య, దావిడ్, సాయి వర్ధన్ గౌడ్ తదితరులు ఉన్నారు.