సులానగర్లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం సులానగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలను సోమవారం నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కినేని శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి కమిటీలే వెన్నెముక అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా బొడ్డు అశోక్, ఉపాధ్యక్షులుగా ఉండేటి దేవరాజు, పూనెం సమ్మయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శులు, కమిటీ సభ్యులను కూడా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, యువజన నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






