80 సీట్లకు పైగా కాంగ్రెస్ విజయం
- వచ్చే ఎన్నికలపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోస్యం
- మళ్లీ సీఎం రేవంత్రెడ్డినే
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): కేసీఆర్ తెలంగాణను ఏ విధంగా దోచుకుని అప్పులపాలు చేశారో ప్రజలకు తెలుసని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే, బీఆర్ఎస్ నేతలు పంది కొక్కుల్లా దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఆదివారం సత్యం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మా ట్లాడారు. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మీరు దిగిపోయినప్పుడు ఉన్న పరిస్థితిపైన కేటీఆర్ విదేశాల్లో స్పీచ్లు ఇవ్వాలన్నారు.
25 యేళ్ల పాలన కాదు వచ్చే రెండున్నర యేళ్లు మీ పార్టీని కాపాడుకుంటే చాలని మేడిపల్లి పేర్కొన్నారు. ప్రతిపక్షంగా ఫైయిల్ కావ డంతో ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తుక్కు తుక్కు ఓడించినా బుద్ధి రావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80కిపైగా స్థానాలను కైవసం చేసుకొని మళ్లీ రేవంత్ రెడ్డినే సీఎం అవుతారని, బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని విమర్శించారు.
పోటీ చేయడానికి బీఆర్ఎస్కు అభ్యర్థులు కూడ దొరకరని, పోటీచేసిన వారి కి డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. మాజీ మావోయిస్టు నేత దేవ్ జీ మా జిల్లాకు చెందిన నాయకుడని, ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే పరామర్శించా నని మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు.






