23 March, 2026 | 2:39 AM

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

23-03-2026 01:08 AM

ములుగు, మార్చి22 (విజయక్రాంతి): అడవుల పరిరక్షణ అందరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనగల ఆధారపడి ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ములుగు జిల్లా పస్రా అటవీ శాఖ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన అడవుల సంరక్షణ, ఆవశ్యకత అవగాహన ర్యాలీ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డిఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాగా ములుగు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని స్పష్టం చేశారు. పంటలు సమృద్ధిగా పండాలన్నా, సరిపడా వర్షపాతం నమోదు కావాలన్నా అడవులే కీలక పాత్ర పోషిస్తాయని, అడవులు అంతరించిపోతే మానవ మనుగడ సైతం అంతరించిపోతుందన్నారు. చతిస్గడ్ ప్రాంతంలో ఇప్ప చెట్లను దైవంగా భావిస్తూ వాటిని అక్కడి ప్రజలు సంరక్షించుకుంటారన్నారు.

అడవుల ద్వారా గిరిజనులకు గిరిజనేతరులకు అనేక లాభాలు ఉంటాయని స్థానిక గిరిజనులు సైతం అటవీ ఉపాధి పొందుతున్నారు. అడవిని సంరక్షించడంలో అటవీ శాఖ అధికారులకు స్థానిక ప్రజలు యువకులు సహాయ సహకారాలు అందించినప్పుడు పూర్తిస్థాయిలో అడవుల రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.

కొంతమంది స్వలాభం కోసం వేసవి కాలంలో అడవులకు నిప్పు పెట్టడం వల్ల మొక్కలు, ఔషధ గుణాలున్న చెట్లు కాలిపోతున్నాయని వన్యప్రాణులను వేటాడడం, చెట్లను నరకడం వంటి కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా ప్రకృతి రమణీయమైన జిల్లాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందని, ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు దట్టమైన అటవీ ప్రాంతాలలో ఉండటంతో అనేకమంది పర్యాటకులు ములుగు జిల్లా అందాలను తిలకించడానికి వస్తున్నారని తెలిపారు. అటవీ దినోత్సవం వేడుకలకే పరిమితం కాకూడదని, ములుగు జిల్లాను అటవీ సంరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు.