గ్రీన్ఫీల్డ్ హైవేపై సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయండి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి
బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు వినతి
ఖమ్మం, మే 31(విజయ క్రాంతి): ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్ హైవే, రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఒక సమగ్ర వినతిపత్రం సమర్పించారు.
ఖమ్మం - దేవరపల్లి గ్రీన్ఫీల్ హైవే నిర్మాణంతో ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలకు సర్వీసు రోడ్లు నిర్మించడంతో పాటు, దళిత, గిరిజన నిరుద్యోగులకు ఉపాధి రుణాలు, పేద రైతులకు వ్యవసాయ బోరుబావులు మంజూరు చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తక్షణ పరిష్కారంగా హైవేకు ఇరువైపులా సర్వీసు రోడ్లు నిర్మించి జిల్లా ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు.
నిరుపేద దళిత, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం కేంద్ర బడ్జెట్ నుంచి ప్రత్యేక రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దినసరి కూలీలుగా ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన యువత స్వయం ఉపాధి పొందేలా కేంద్ర ప్రభుత్వ పథకాలను వారికి వర్తింపజేయాలని కోరారు. సింగరేణి మండలం మాధారం గ్రామానికి చెందిన పేద ఎస్సీ, ఎస్టీ రైతుల వ్యవసాయ భూములకు సాగునీటి సదుపాయం కల్పించాలని మంత్రిని కోరారు.
సరైన నీటి వసతి లేక, సొంతంగా బోరుబావులు తవ్వించుకునే స్థోమత లేక ఎంతోమంది పేద రైతుల భూములు బీడువారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సాగునీటి పథకాలైన పీఎం-కుసుమ్ , పీఎంకేఎస్త్వ్ర ద్వారా ఈ గ్రామంలోని అర్హులైన రైతులకు ఉచితంగా బోరుబావులు, పంపుసెట్లు మంజూరు చేయాలని విన్నవించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.






