స్ట్రామ్ వాటర్ డ్రైన్ పై స్లాబ్ నిర్మాణం
అధికారులకు యాదగిరి సునీల్ రావు ఆదేశాలు
ముకరంపుర, జూలై 9(విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని ఎస్.బి.ఎస్ ఫంక్షన్ హాల్ నుండి కలెక్టరేట్ వరకు ఉన్న ఓపెన్ స్ట్రామ్ వాటర్ డ్రైన్ ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ఇండ్ల మధ్యలో ఉన్న ఈ అతిపెద్ద ఓపెన్ డ్రైన్ వల్ల ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిని నివారించడానికి సుమారు 22 సంవత్సరాల క్రితం ఈ స్ట్రామ్ వాటర్ డ్రైన్ను నిర్మించినట్లు తెలిపారు.కరీంనగర్ నగరం నుండి వచ్చే వరద నీటిలో 20 శాతానికి పైగా నీళ్లు ఈ కాలువ గుండానే వెళ్తాయని ఆయన తెలిపారు. కరీంనగర్ నగరంలో ఉన్న నాలుగు మురికి కాల్వలలో ఇది ఒక ప్రధాన మురికి కాలువ.
కాలువ పాడైపోయిన చోట పునర్నిర్మాణం చేయడంతో పాటు, అవసరమైన చోట రిటైనింగ్ వాల్స్ నిర్మించి, డ్రైనేజీ మొత్తం కవర్ అయ్యేలా పైభాగంలో స్లాబ్ వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల కాలువ నుండి వచ్చే దుర్వాసన అరికట్టడమే కాకుండా, వర్షాకాలంలో ఎలాంటి ప్రాణాపాయం, ప్రమాదాలు జరగకుండా వరద నీటి ప్రవాహానికి ఇది అత్యంత కీలకమైనది కావడంతో, దీనికి ప్రాధాన్యత ఇచ్చి నిర్మిస్తున్నట్లు సునీల్ రావు వెల్లడించారు. ఈ నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే అంచనాలు రూపొందించి, పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు గట్టు స్వామి, కాలిద్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.






