10-09-2025 04:31:52 PM
కలెక్టర్ కుమార్ దీపక్..
మంచిర్యాల, (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. బుధవారం పట్టణంలోని కాలేజ్ రోడ్డులో గల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు, హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించేందుకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం ఆధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేసి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు రూ. 216 కోట్లతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనూష, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.