26-06-2025 07:42:40 PM
ప్రతి కార్యకర్త సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి..
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్. కే సాబీర్ పాషా
ప్రజల పక్షాన సిపిఐ నిరంతరం పోరాటం : బొల్లోజు అయోధ్య
ఘనంగా సిపిఐ మండల మహాసభలు
మణుగూరు (విజయక్రాంతి): త్యాగాలు, పోరాటాలకు భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) మారుపేరుగా నిలిచిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా(District Secretary S.K. Sabir Pasha) అన్నారు. నిర్బంధాలు ఎదురైనా అధిగమిస్తూ ఎదిగిన పార్టీ నీడన రాష్ట్రంలో లక్ష కుటుంబాలు ఉన్నాయని వెల్లడించారు. గురువారం పార్టీ నాయకులు చింతల దశరథం, దుబ్బాక నిర్మల, బడిశా సతీష్ అధ్యక్షతన సిపిఐ మండల, పట్టణ మహాసభలు స్థానిక కిన్నెర కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ముందుగా పార్టీ నాయకులు అయోధ్య అరుణ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
సీపీఐ ఆవిర్భావంలో నిర్బంధాలు ఎదురైనా స్వాతంత్య్ర పోరాటంలోనూ పార్టీ నాయకులు పాల్గొన్నారని గుర్తుచేశారు. జమీందారులు, జాగీర్దారీ వ్యవస్థ పోయి పేదలకు భూమి దక్కడం నేతల పోరాటఫలితమేనన్నారు. మారిన రాజకీయ పరిస్థితులు, పాలకుల తీరు కమ్యూనిస్టుల అవసరాన్ని గుర్తుచేస్తుండగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీని విస్తరిస్తామని వెల్లడించారు. సిపిఐ పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎత్తుపల్లాలను చూసిందని, సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజల కోసం పోరాడుతుందన్నారు.ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాట త్యాగాల గుర్తులు ఉన్నాయన్నారు. దేశంలో సీపీఐ పార్టీ వందేళ్ల ప్రస్థానంలో సాగించిన ప్రజా పోరాటాల ద్వారా సాధించిన విజయాల స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రజల హక్కుల కోసం పోరుబాటలో ముందుకు వెళ్తామని తెలిపారు.
మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాల పునాదులపై సీపీఐ ఆవిర్భవించిందని, దేశ చరిత్రలో కమ్యూనిస్టు పార్టీది ప్రముఖ పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో భూసంస్కరణలు, కార్మిక హక్కులు, అనేక సంక్షేమ పథకాలు కమ్యూనిస్టుల పోరాటల ఫలితంగా వచ్చాయని గుర్తు చేశారు. పేదలు,దళితులు, మైనార్టీలు, బలహీన వర్గాల అభ్యున్నతికి, ప్రజల హక్కుల సాధన కోసం సీపీఐ నిరంతర పోరాటాలు చేస్తోందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు నేటికి పూర్తిగా అమలు కావడం లేదని, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక రాజ్యాంగానికే ప్రమాదం వచ్చిపడిందని విమర్శించారు. మహిళలు, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. విభజన, విద్వేష రాజకీయాలలో బీజేపీ దేశ సమగ్రతకు సవాల్ గా మారిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, కార్పోరేట్ సంస్థల ఆధిపత్యం పెరిగిపోయి దేశ సంపద కార్పేరేట్ల జేబుల్లోకి వెలుతుందన్నారు.
ఆయా సమస్యలపై సీపీఐ నిర్మాణాత్మక ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సమస్యల పరిష్కారం కొరకు ప్రతి కార్యకర్త సమరశీల పోరాటాలకు, ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను హతమారుస్తున్నారని, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా పాత్ర పై భారత్ తన విధానాన్ని వెల్లడించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ఆరు గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు అర్హులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం సిపిఐ రాష్ట్ర నాయకులు అయోధ్య మాట్లాడుతూ.. పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టు పార్టీ ల పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను చేపట్టి అణిచివేత ధోరణిఅవలంబిస్తూ ,నాయకులపై ప్రజా స్వామ్య వాదులు, పౌర హక్కుల నాయుకుల పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని,దీనిని పూర్తిగా సిపిఐ పక్షాన వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని అన్నారు.భూమికోసం, భుక్తి కోసం అణగారిన ప్రజల విముక్తి కోసం అలుపెరుగని పోరాట చరిత గలిగిన పార్టీ సిపిఐ అని, ప్రజలపై జరుగుతున్న దోపిడీ దౌర్జన్యాలను సిపిఐ ఎండగట్టిందని అదే స్ఫూర్తితో ప్రజా జీవన పోరాటంలో కీలక పాత్ర సిపిఐ పార్టీ పోషిస్తుందని పేర్కొన్నారు.
గ్రామాలలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వాల మెడలు వంచుటకు అనేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన సిపిఐ కి ఘన చరిత్ర గలదని అన్నారు. ప్రభుత్వాలు పెంచిన ధరలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రజల వెనుక నీడలా ఉండి ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచిన ఏకైక పార్టీ అని తెలిపారు ఇంత పోరాట శక్తి కలిగిన సిపిఐ పార్టీని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామాలలో ప్రజలు ఆదరించి పనిచేసే అభ్యర్థులకు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. భవిష్యత్తు లో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి సరెడ్డి పుల్లారెడ్డి, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి , మండల కార్యదర్శి జంగం మోహన్ రావు, పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్, జిల్లా సమితి సభ్యులు ఆర్ .లక్ష్మీ నారాయణ, ఎస్. కే. సర్వర్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి వై. రాంగోపాల్, సొందే కుటుంబరావు రాయల భిక్షం గడ్డం వెంకటేశ్వర్లు, బోలగాని సమ్మక్క, దుబ్బాక నిర్మల,, కొత్తపల్లి సీతారాములు,రామనర్సయ,మేకల ఈశ్వర్, తోట రమేష్, జక్కుల రాజబాబు, వజ్జా వెంకటేశ్వర్లు, పాయం లక్ష్మయ్య,ఎడారి రమేష్, కణితి సత్యనారాయణ, పులిగల రమేష్ లు పాల్గొన్నారు.