అలంపూర్ రహదారుల అభివృద్ధికి రూ.60.37 కోట్లు మంజూరు చేయాలి
మంత్రి కోమటిరెడ్డిని కోరిన ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్, జూలై 13: అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్అండ్బీ రహదారుల పునరుద్ధరణ, రెండు చిన్న వంతెనల నిర్మాణానికి రూ.60.37 కోట్ల నిధులు మంజూరు చేసి పరిపాలనా అనుమతులు ఇవ్వాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా స్థానిక నాయకులతో కలసి మంత్రికి వినతి పత్రాన్నిసమర్పించారు.
నియోజకవర్గంలో చాలా రహదారులు పీరియాడికల్ రిన్యువల్ పనులు లేక దెబ్బతిన్నాయని, దీంతో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శాఖ ప్రతిపాదించిన 15 రహదారుల పునరుద్ధరణ పనులతో పాటు రెండు చిన్న వంతెనల నిర్మాణానికి రూ.60.37 కోట్ల నిధులు మంజూరు చేస్తే రహదారి సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు.






