తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు క్యాలెండర్ సంవత్సరం 2026 నుండి వర్తించేలా డీఏను(DA hike) 2.1 శాతం పెంపును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) శుక్రవారం ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏ ను ప్రభుత్వం విడుదల చేసింది. డీఏ 50.7 శాతం నుండి 52.8 శాతానికి పెంచబడింది. సవరించిన ఈ డీఏ జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తుంది. గత మూడు నెలల బకాయిలను, రాబోయే మూడు నెలల పాటు అనుబంధ బిల్లుల (Supplementary Bills) ద్వారా చెల్లిస్తారని మంత్రి వెల్లడించారు.
ఈ పెంపుదల కారణంగా ఆర్టీసీపై నెలకు రూ. 2.82 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతకుముందు, జూలై 2025లో, రాష్ట్ర ప్రభుత్వం డీఏను 2.1 శాతం మేర పెంచి, దానిని 48.6 శాతం నుండి 50.7 శాతానికి చేర్చింది. ప్రస్తుత సవరణతో డీఏ ఇప్పుడు 52.8 శాతానికి చేరుకుంది. మే 2024లో RPS–2017 అమలుతో, ఉద్యోగులకు సంబంధించిన ఎటువంటి డీఏ బకాయిలు పెండింగ్లో లేవు. డీఏ పెంపు సందర్భంగా మంత్రి ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీ. నాగి రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
డీఏ ప్రకటించినందుకు సీనియర్ అధికారులు కూడా మంత్రిని అభినందించారు. ఆర్టీసీ పెండింగ్ పనులు(RTC Pending Works), అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి, పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఏకైక కరువు భత్యం (DA) ఇప్పుడు మంజూరు చేయబడిందని మంత్రి తెలిపారు. సవరించిన 52.8 శాతం కరువు భత్యం జనవరి 2026 నుండి అమల్లోకి వస్తుంది. జనవరి నుంచి బకాయిపడిన మొత్తాలను రాబోయే మూడు నెలల్లో వాయిదాలలో విడుదల చేస్తామని తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమాన్ని నిర్ధారించడం, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆర్టీసీ సంస్థను పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. ప్రధానంగా కార్మికుల సంక్షేమంపై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణకు ఆసుపత్రి అప్గ్రెడేషన్ ,కారుణ్య నియామకాలు,దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం, కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం ,కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తుందని పేర్కొన్నారు.




