గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
కరీంనగర్,(విజయక్రాంతి) కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను వరుసగా పెంచుతూ సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ గందే మాధవి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్యాస్ ధరల పెంపు కుటుంబాల బడ్జెట్ను మరింత దెబ్బతీస్తోందన్నారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పేరుతో పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు అదే పేదలపై ధరల భారాన్ని మోపడం దురదృష్టకరమని ఆమె విమర్శించారు. గత కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు గణనీయంగా పెరిగి మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కాబట్టి తక్షణమే గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.






