16-12-2025 01:52:18 AM
ఎక్స్లో ‘ఆస్క్ కవిత’లో జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీలో ఉంటామని, సామాజిక తెలంగాణే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్పై ఎక్స్లో సోమవారం పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. తెలంగాణ విషయం లో తన విజన్, జాగృతి భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభు త్వ వైఫల్యాలపై నెటిజన్లు సంధించిన పలు ప్రశ్నలపై కవిత స్పందించారు.
యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని, అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందని చెప్పారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామని స్పష్టంచేశారు.
తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని తెలిపారు. జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని, త్వరలోనే జాగృతి మెంబర్ షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందని విమర్శించారు.