ప్రతి కుటుంబం వెంటనే వివరాలు నమోదు చేయాలి : జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి
హనుమకొండ,(విజయక్రాంతి): 2027 జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ స్వీయ జనగణనకు ఈ నెల 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉన్నందున, హన్మకొండ జిల్లా ప్రజలందరూ తప్పనిసరిగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి సూచించారు. ప్రజలు ఇంటి వద్ద నుంచే సులభంగా https://se.census.gov.in. వెబ్సైట్ ద్వారా స్వీయ గణన పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
మొబైల్ ఫోన్ ద్వారానే ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చని, తమకు నచ్చిన భాషను ఎంపిక చేసుకుని కుటుంబ వివరాలను నమోదు చేయవచ్చని పేర్కొన్నారు.గత నెల 26వ తేదీ నుండి ప్రారంభమైన ఈ స్వీయ జనగణన కార్యక్రమం ఈ నెల 10వ తేదీతో ముగియనున్నందున, ఇంకా నమోదు చేయని వారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
జనగణన ప్రక్రియలో భాగంగా ముందుగా స్వీయ గణన, అనంతరం గృహాల లెక్కింపు, తదుపరి పూర్తి స్థాయి జనగణన చేపడతారని వివరించారు.ఈ నెల 11వ తేదీ నుండి ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారని తెలిపారు. దేశ ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పన, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలు, వనరుల సమర్థవంతమైన పంపిణీకి జనగణన అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా తమ ప్రస్తుత నివాసం నుంచే వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
జనగణన సందర్భంగా కుటుంబానికి సంబంధించిన పూర్తి మరియు సరైన వివరాలను అందించాలని ప్రజలను కోరారు. ప్రజలు అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, అది కేవలం జనాభా లెక్కల కోసం మాత్రమే వినియోగించబడుతుందని స్పష్టం చేశారు. ఆన్లైన్ నమోదు పూర్తయ్యాక ఎన్యుమరేషన్ ఐడి లభిస్తుందని, ఆ ఐడీ ఆధారంగా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని తెలిపారు.స్వీయ జనగణనకు ఒక్కరోజే గడువు మిగిలి ఉన్నందున, హన్మకొండ జిల్లా ప్రజలందరూ బాధ్యతగా పాల్గొని ఈ జాతీయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి పిలుపునిచ్చారు.






