04-06-2025 12:00:00 AM
వనపర్తి, జూన్ 3 (విజయక్రాంతి): అందరం కలిసి ముం దుకెళితే వనపర్తి పట్టణం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని, వనపర్తి పట్టణంలో చేపట్టే రోడ్ల విస్తరణ కు ప్రతి ఒక్కరు సహకరించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రోడ్ల విస్తరణ భాధితులను కోరారు. మంగళవారం ఉదయం వనపర్తి పట్టణంలోని పానుగల్ రోడ్డులో గల 22, 23 వార్డుల లో రోడ్డు విస్తరణలో నివాసాలను కోల్పోతున్న బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే నేరుగా కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ పార్టీ పాలనలో రోడ్ల విస్తరణకు అంకురార్పణ చేశారని నాడు ఎన్నో హామీలను గుప్పించి అడుగడు గునా తమను మోసం చేసి పోయారని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారి గోడును వెళ్ళబోశారు ఇప్పటికే కొంతమందికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారని అవి ఉపయోగానికి పనికి రాకుండా ఉన్నాయని వాటిని సరిచేసి ఇవ్వాలని, అదేవిధంగా వృద్ధులైన తమకు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లలో ఇండ్లను కేటాయిస్తే వెళ్లలేకపోతున్నామని వారు వాపోయారు.
బాధితుల నుంచి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే స్పందిస్తూ రోడ్డు వెడల్పు చేయడం తప్పనిసరి అనీ దానికి అందరూ సహకరించాలని రోడ్డు వెడల్పులో ఇండ్లను కోల్పోతున్న ప్రతి ఒక్కరికి వారి వారి నష్టానికి తగినట్లుగా తగిన సహాయ సహకారాలు అందజేస్తామని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ కౌన్సిలర్లు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాధితులు తదితరులు పాల్గొన్నారు.