ఐదవ బెటాలియన్లొ డీజీపీ పర్యటన
సమర్థవంతమైన పోలీసింగ్పై దిశానిర్దేశం
గోవిందరావుపేట, ఆగస్టు 10 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ సోమవారం 5వ బెటాలియన్ తెలంగాణ ప్రత్యేక పోలీస్ ములుగును సందర్శించి బెటాలియన్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం మరియు ఆన్లైన్ బెట్టింగ్ల పై ప్రజల్లో అవగాహన కల్పించాలని వాటికీ దూరంగా ఉండాలని సూచించారు.
అనంతరం ప్రధానంగా బెటాలియన్ పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, సిబ్బంది శిక్షణ, క్రమశిక్షణ, విధి నిర్వహణలో నైపుణ్యం, శారీరక దారుఢ్యం మరియు ఆపరేషనల్ సన్నద్ధతపై డీజీపీ దిశానిర్దేశం చేశారు. బెటాలియన్ సిబ్బంది ఎల్లప్పుడూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బెటాలియన్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను మరింత మెరుగుపరచడంతో పాటు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ఆధునిక పోలీసింగ్కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, శిక్షణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డీజీపీ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను, అవసరాలను తెలుసుకున్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బెటాలియన్ అభివృద్ధి మరియు సిబ్బంది సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ (బెటాలియన్స్) సంజయ్ కుమార్ జైన్, మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏఎస్పి మనన్ బట్, శివ ప్రసాద్ రెడ్డి 4వ బెటాలియన్ కమాండెంట్, 5వ బెటాలియన్ అదనపు కమాండెంట్ (ఇన్చార్జ్ కమాండెంట్) సీతారా, సహాయకమాండెంట్ కృష్ణ ప్రసాద్, ఆర్ ఐ లు, బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






