27-05-2025 01:26:36 AM
వడోదర, మే 26: ‘ఉగ్రదాడులు చేసి పారిపోతే మోదీ చేతులు కట్టుకుని నిశబ్దంగా కూర్చుంటాడని అనుకున్నారాఝ.’ అని ప్రధాని మోదీ పాకిస్థాన్ను ప్రశ్నించారు. సోమవారం గుజరాత్లో ఆయన పర్యటించారు. భుజ్తో పాటు దహోడ్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభల్లో ఆయన ప్రసంగించారు.
దహోడ్ సభలో మాట్లాడుతూ.. ‘మన తోబుట్టువులు, తల్లుల నుదుటి నుంచి ఎవరైనా సిందూరాన్ని తుడిచేస్తే.. వారు కూడా తుడిచిపెట్టుకుపోతారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. భారతీయుల విలువలు, భావోద్వేగాల వ్యక్తీకరణ.’ అని తెలిపారు.
పాక్కు ఉగ్రవాదమే జీవనాధారం
పాకిస్థాన్కు ఉగ్రవాదమే జీవనాధారం అని మోదీ ధ్వజమెత్తారు. భుజ్ బహిరంగసభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ టెర్రరిజాన్ని ఓ టూరిజంలా భావిస్తోంది. పాక్ ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకోకపోతే భారత సైన్యం ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్ పర్యాటక రంగాన్ని విశ్వసిస్తుంటే.. పాక్ ఉగ్రవాదాన్నే పర్యాటకంగా పరిగణిస్తోంది.
పాకిస్థాన్ ప్రజలారా ఏం సాధించారు? ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి మీ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాక్ ప్రజలు మందుకు రావాలి.’ అని పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ప్రధానిపై పూల వర్షం కురిపించిన కల్నల్ కుటుంబం
కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబం ప్రధాని మోదీ వడోదర రోడ్ షో సందర్భంగా పూల వర్షం కురిపించారు.