13-06-2025 01:30:00 AM
హైదరాబాద్, జూన్ 1౨ (విజయక్రాంతి): ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. గోదావరి, కృష్ణా పరివాక ప్రాంతాల్లో వీలైనంత వరకు ప్రాణ, ఆస్తి, ఆర్థిక నష్టం జరగకుండా ఇప్పటినుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.
గోదావరి, కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ..ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగిన తర్వాత స్పందించేదాని కంటే ముం దస్తుగా నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
హైదరాబాద్ తరహాలోనే రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలు, విపత్తుల నిర్వహణ విభాగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమి షనర్, అగ్నిమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటి పారుదల, ఆర్అండ్బీ, ఆరోగ్య శాఖల కమిషనర్లతో ఉన్నతస్థాయి కమిటీని వేర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.
ఈ కమిటీ వారంలో రోజుల్లో నివేదిక ఇస్తుందని, కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడుతామని ఆయన వివరించారు. ఈ ఏడాది వర్షాకాల సీజన్ అనుకున్న దానికంటే 15 రోజుల ముందుగానే వచ్చిందని దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుని ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వీలైనంత వరకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ నవీన్ మిట్టల్, విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ హరీశ్, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పీఆర్ కమిషనర్ సృజన పాల్గొన్నారు.