20 July, 2026 | 8:41 PM

తైక్వాండోతో క్రమశిక్షణ.. స్పోర్ట్స్ కోటాతో ఉద్యోగ, విద్యా అవకాశాలు

20-07-2026 01:30 AM

అచ్చంపేటలో జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు

అచ్చంపేట, జూలై 19: క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని  బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పబ్లిక్ క్లబ్ మాజీ అధ్యక్షులు పోకల మనోహర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పబ్లిక్ క్లబ్ మాజీ అధ్యక్షులు వెన్ను శ్రీనివాసులు అన్నారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అచ్చంపేట పబ్లిక్ క్లబ్లో నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్2026 పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ విభాగాల క్రీడాకారులు క్యోరుగి, పూమ్సే విభాగాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. 

ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా  హాజరయ్యారు. తైక్వాండో వంటి మార్షల్ ఆరట్స్ యువతలో ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించే పట్టుదల, ఏకాగ్రతను అలవర్చుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తల్లిదండ్రులు, క్రీడా సంఘాలు మరింత ప్రోత్సాహం అందించాలన్నారు. రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే. శ్రీహరి మాట్లాడుతూ తైక్వాండో ఒలింపిక్ క్రీడగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాల్లో విద్య, ఉద్యోగ అవకాశాల్లో స్పోరట్స్ కోటా కింద 2 శాతం రిజర్వేషన్ అమలులో ఉందన్నారు.

తైక్వాండో ద్వారా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు, బీటెక్ కళాశాలల్లో ప్రవేశాలు సాధించారని గుర్తుచేశారు.  జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన 46 మంది క్రీడాకారులను ఆగస్టు 8, 9, 10 తేదీల్లో కరీంనగర్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అక్కడ ఎంపికైన క్రీడాకారులను అక్టోబర్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయి పోటీల నిర్వహణకు ఆతిథ్యమిచ్చి సహకరించిన అచ్చంపేట పబ్లిక్ క్లబ్ నిర్వాహకులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ అధ్యక్షులు అంగిరేకుల బిక్షపతి, తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కానోజ్ మనోహర్ ప్రసాద్, సహాయ కార్యదర్శి మహమ్మద్ ఫయీం, కోశాధికారి పోకల ప్రవీణ్, మాజీ సర్పంచ్ పిల్లి హరిచంద్ర, పబ్లిక్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, గౌరవ సభ్యులు, నాగర్కర్నూల్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి బి. శేఖర్, కోచ్లు, రెఫరీలు, న్యాయనిర్ణేతలు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.