15 May, 2026 | 8:54 PM

పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న

15-05-2026 08:14 PM

 విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశంస

ఖానాపూర్,(విజయక్రాంతి): రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలిచి ఒడ్డు దాటాక తెప్ప తగిలేసే నాయకులు ఉన్న ఈ రోజుల్లో తన సొంత ఖర్చులతో పరీక్ష రాయడానికి కేంద్రానికి వచ్చిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు చల్లని నీరు, అంబలి, పంపిణీ చేసిన సర్పంచ్ ఉదారత ఇది. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామం తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాల వద్ద శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కి వందల సంఖ్యలో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వచ్చారు.

తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఆ పల్లెటూరు  లోఎటువంటి  వసతులు లేక విద్యార్థులు, తల్లిదండ్రులు తాగునీటి కోసం, ఆకలికి అలమటిస్తున్నది గ్రహించి ఆ గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్నలు స్పందించి పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేపట్టారు. ఇప్పటికి మూడు సార్లు ఆ గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికై సేవ చేస్తున్న గంగన్న ప్రతి ఎండాకాలం ఏటేటా ఖానాపూర్ ,కడం ప్రధాన రహదారిపై చలివేంద్రం, అంబలి పంపిణీ ఉచితంగా చేపట్టడం పలువురి ప్రశంసలు అందుకుంటుంది. ఈ నేపథ్యంలో పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు సర్పంచ్ సేవలను కొనియాడారు.