పరపతి కోసమే డబ్బులు పంపిణీ
ప్రజల నాడిని కేటీఆర్ పసిగట్టలె
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
రాజన్న సిరిసిల్ల, మే 15 (విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, మాంసం పంచను అని చెప్పిన కేటీఆర్.. లోక్సభ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచారని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఓట్లకు డబ్బులు పంచి తన పరపతి కాపాడుకోవడం కోసం కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బుధవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పరిపాలనలో ప్రజల నాడిని కేటీఆర్ పసిగట్టలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో కూడా కేటీఆర్ డబ్బులు పంచే గెలిచాడని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమవుతుందని తెలిసి ఓటర్లకు డబ్బులు పంచారని, ప్రజలకు కేటీఆర్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడుగాల్సింది పోయి, డబ్బులు పంచి ఓట్లు అడిగారని విమర్శించారు. తాను ఓటర్లకు డబ్బులు పంచనని, వాటికి దూరంగా ఉంటానని, నైతిక విలువలతో రాజకీయం చేస్తానని గొప్పలు చెప్పి ఎన్నికలు వచ్చేసరికి ఏమైందన్నారు.




