calender_icon.png 6 June, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతన్నకు దన్నుగా నిలవనున్న నాణ్యమైన విత్తనాల పంపిణీ

03-06-2025 12:45:20 AM

మహబూబాబాద్, జూన్ 2 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాన్ని స్థానికంగానే ఉత్పత్తి చేసి అందించడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం’ అన్నదాతకు ‘వెన్నుదన్ను’గా నిలుస్తుందని ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ అన్నారు.

గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గ్రామాన నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు.  వ్యవసాయ పరిశోధన స్థానాలలో ఉత్పత్తి చేసిన నాణ్యమైన విత్తనాన్ని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఎంపిక చేయబడిన ముగ్గురు నుండి ఐదుగురు అభ్యుదయ రైతులకు ఇవ్వనున్నట్లు చెప్పారు.

నాణ్యమైన విత్తనాన్ని రైతులు సాగు చేసి దిగుబడి వచ్చిన తర్వాత ఆ విత్తనాన్ని గ్రామంలో తోటి రైతులకి అందజేయాల్సి ఉంటుందన్నారు. ఈ విధంగా రానున్న రెండు, మూడు సంవత్సరాలలో ప్రతి గ్రామం విత్తన స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రం విత్తన భద్రతలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నదే ముఖ్య ఆశయమన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల్లోని 81 క్లస్టర్ల లో 273 గ్రామాలను ఎంపిక చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు. ఇందులో వరి రకాలు డబ్ల్యూజిఎల్ 44, డబ్ల్యూజిఎల్ 1246, డబ్ల్యూజిఎల్ 1355 , ఎంజిజి 385 పెసర విత్తనాల మినీ కీట్లను అభ్యుదయ రైతులకు అందజేస్తున్నట్లు డీఏవో చెప్పారు