calender_icon.png 4 June, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొన్నం షోపుటప్‌కే ఉన్నడు

03-06-2025 12:47:09 AM

మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఫైర్

హుస్నాబాద్, జూన్ 2 :  మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. వాకింగ్ పేరుతో మంత్రి పీఆర్ స్టంట్స్ చేస్తున్నారని ఫైర్ అయిన ఆయన, హుస్నాబాద్లో మాతాశిశు ఆసుపత్రి నిర్మాణం అసంపూర్తిగా ఉందని, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు ఊసే లేదని విమర్శించారు.

సోమవారం ఆయన హుస్నాబాద్ లోని బీఆర్‌ఎస్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ వస్తే ఉదయం వాకింగ్ పేరుతో ప్రజలను కలుస్తున్నట్టు ఫొటోలు దిగి ప్రచారం చేసుకుంటున్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వాకింగ్ ఎందుకు?  నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, వారి సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి అధికారికంగా సమావేశాలు ఏర్పాటు చేయాలి‘ అని అన్నారు.

మాతాశిశు ఆసుపత్రి, ఇంజినీరింగ్ కాలేజీ ఏమయ్యాయి?

మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్కు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదని సతీశ్ కుమార్ విమర్శించారు. ‘హుస్నాబాద్లో మాతాశిశు ఆసుపత్రి నిర్మాణం ఇంకా అసంపూర్తిగానే ఉంది. మహిళలు, చిన్నారులకు మెరుగైన వైద్యం అందించే ఈ ఆసుపత్రిని పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.

అంతేకాకుండా, హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, మంజూరైందని చెప్పారు. దాని ఊసే లేదు. మంత్రి గారు ఈ హామీలను ఎందుకు విస్మరించారు? కేవలం ఫొటోలకు పోజులివ్వడం కాదు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి‘ అని ఆయన డిమాండ్ చేశారు.  

’యువ వికాసం’ పేరుతో అక్రమాలు

ఈ సందర్భంగా సతీశ్ కుమార్ కాంగ్రెస్ పాలనపై  మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, రైతులకు సకాలంలో మద్దతు ధర లభించకపోవడం వంటి సమస్యలు రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతాంగానికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది రైతాంగానికి శాపంగా మారింది.

అసమర్థ పాలన, అడ్డగోలు అవినీతితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోంది‘ అని ఆయన ఆరోపించారు. యువ వికాసం’ పథకం కేవలం కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికే ఉద్దేశించబడిందని, అర్హులను పక్కన పెట్టి కాంగ్రెస్ నాయకుల కుటుంబాలకు చెందినవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని సతీశ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ 

 బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన నిలబడుతుంది

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాల కోసమే బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందని సతీశ్ కుమార్ గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సాధన సాధ్యమైందని, పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.

‘బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, అవినీతి పాలనపై పోరాటం చేస్తుంది‘ అని సతీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.