03-06-2025 12:43:58 AM
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట, జూన్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద గల అమరవీరుల స్తూపానికి, ముస్తాబాద్ చౌరస్తాలో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలలో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ మొదటగా అమలు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని వెల్లడించారు.
రాజీవ్ యువ వికాసం, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు లాంటి నిరుపేదలకు లబ్ధి చేకూరే పథకాలు తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తుందని వివరించారు. అన్ని కుల, వర్గాలకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పరమైన అభివృద్ధి జరుగుతుందని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ, అదనపు కలెక్టర్లు గరీమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.