08-12-2025 10:39:31 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పిఎస్పిడీ భద్రాచలం యూనిట్ను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్శనలో యూనిట్ హెడ్ శైలేందర్ కుమార్ సింగ్ యూనిట్ మేనేజ్మెంట్, ప్లాంట్లో అమలు చేస్తున్న ఆధునిక భద్రతా ప్రమాణాలు, ఎనర్జీ ఎఫిషియెన్సీ చర్యలు, అలాగే యంత్రాంగ పనితీరును మెరుగుపరచడంతో పాటు బ్రేక్డౌన్లను తగ్గించేందుకు చేపట్టిన టిపిఎం (టోటల్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్) విధానం గురించి కలెక్టర్కు విపులంగా వివరించారు. ప్రాసెస్ కంట్రోల్ వ్యవస్థలు ఉత్పత్తి ప్రతి దశలో ఎలా ఖచ్చితత్వం, నాణ్యత, ఆపరేషనల్ నమ్మకాన్ని నిర్ధారిస్తున్నాయో మేనేజ్మెంట్ ప్రెజెంటేషన్ రూపంలో తెలియపరచారు.
పేపర్, బోర్డు తయారీ ప్రక్రియలో వినియోగిస్తున్న ఆధునిక యంత్రాంగం, ఆటోమేషన్ టెక్నాలజీ, పర్యావరణ హిత తయారీ విధానాలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్శన ద్వారా ఐటీసీ పిఎస్పీడీ యూనిట్లో భద్రత, టిపిఎం ఆధారిత సామర్థ్యవృద్ధి, పర్యావరణానుకూల ఉత్పత్తి విధానాలపై ఉన్న నిబద్ధతను జిల్లా పరిపాలన మరింత సమగ్రంగా అవగాహన చేసుకుంది. ప్లాంట్ కార్యకలాపాలలో నాణ్యత, భద్రత, పారిశ్రామిక ప్రమాణాల అమలుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ హెడ్ పి. శ్యామ్ కిరణ్, అడ్మినిస్ట్రేటివ్ చెంగల్ రావు తదితర సీనియర్ మేనేజ్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.