13-10-2025 07:54:21 PM
ఎస్పీ రాజేష్ చంద్ర రైతులకు సూచన..
కామారెడ్డి (విజయక్రాంతి): రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రోడ్లపై పంటలు ఆరబెట్టవద్దని ప్రయాణికుల ప్రాణాలు రక్షించవలసిన బాధ్యత ఉందని.. చిన్న నిర్లక్ష్యం పెద్ద విషాదం కాకూడదని అన్నారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువ భాగం రోడ్లపై మక్కలు, వడ్లు, ఆరబెట్టడం వల్ల జరిగినవని గుర్తించబడిందన్నారు. రోడ్లపై పంటలు ఆరబెట్టడం వల్ల వాహనాలు జారి అదుపు తప్పడం, రోడ్డు మీద కూర్చున్న రైతులు లేదా పాదచారులు ఢీకొనడం వంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కుటుంబాలు తమ కుటుంభ పెద్దలను, సభ్యులను కోల్పోయి తేరుకోలేని స్తితిలోకి వెళ్తున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వడ్లు, మక్కలు, జొన్నలు వివిధ రకాల ధాన్యాలు రోడ్లపై ఆరబెట్టకండని తెలిపారు. చిన్న నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం కోల్పోతుందన్నారు. అందరి భద్రత మన చేతుల్లోనే ఉందని తెలిపారు. రైతులు వారి ధాన్యాలను వారి పంటపొలం నందు, గ్రామ పంచాయతీలు లేదా రైతు సమితులు కేటాయించిన ప్రత్యేక ప్రదేశాల్లోనే ఆరబెట్టాలని తెలిపారు. రోడ్లపై ఆరబెట్టకూడదని సూచించడంతో పాటు ప్రజల అవఘాహనర్థం రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్లపై పంటలు ఆరబెట్టడం చిన్న నిర్లక్ష్యంగా అనిపించినా అది పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ప్రతి ఒక్కరూ దీనిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఒక వెలకట్టలేని విలువైన ప్రాణాన్ని రక్షించగలమని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.