సెస్ను ఎన్పీడీసీఎల్లో కలపొద్దు
మహాజన సభలో ప్రతినిధుల హెచ్చరిక
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ప్రజల ఆస్తి అయిన సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థను ప్రాణమున్నంత వరకు కాపాడుకుంటామని సెస్ ప్రతినిధులు స్పష్టం చేశారు. రూ.వందల కోట్లు బకాయిలు ఇవ్వకుండా నష్టాల్లో ఉందంటూ సాకులు చూపి, ఎన్పీడీసీఎల్ సంస్థలో విలీనం చేస్తే రాష్ట్రం అగ్ని గుండమవుతుందని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.
శనివారం చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన జరిగిన 52వ మహాజనసభలో సెస్ ప్రతినిధులు పలు తీర్మాణాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అమోదించారు. సెస్ లైసెన్సు పునరుద్ధరించకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా, బోర్డులో కలపాలన్న కుట్రలను మహజన సభ గర్జించింది. సెస్ పరిధిలోని 262 గ్రామ పంచాయతీల నుంచి సెస్ విలీనాన్ని విరమించుకొని, లైసెన్సును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తీర్మాణాలు చేసిన కాపీలను సభలో చైర్మన్కు ప్రతినిధులు అందజేశారు. సెస్ విలీనాన్ని అడ్డుకునేం దుకు అవసరమైతే కోర్టుకెళతామని సభ తీర్మాణం చేసింది.
సర్కారు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని తీర్మాణం చేసింది. సిరిసిల్ల ప్రాంత పెద్దలు ఎంతో కృషి చేసి స్థాపించిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చైర్మన్ చిక్కాల రామారావు అన్నా రు. సెస్ను కాపాడుకునేందుకు జిల్లా ప్రజలు కలిసి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.
ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సుమారు రూ. 7వందల కోట్లకు పైగా బకాయిలున్నట్లు తెలిపారు. బకాయిలు ఇవ్వకున్నా సెస్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు నెలనెల చెల్లిస్తూ, సంస్థను అభివృద్ధిలో ముందుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. సెస్లో అవినీతి జరిగిదంటూ దుష్ర్పచారం చేస్తున్న వారు నిరూపించాలని, దీనిపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పాలకవర్గం అవినీతికి పాల్పడినా అందుకు దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. సమావేశంలో వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు, అన్ని గ్రామాల ప్రతినిధులు, రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు.




