22-11-2025 04:38:57 PM
డబ్బులు తీసుకుని మద్యం వ్యాపారులకు అనుకూలంగా అధికారులు..
వైన్స్ రద్దు చేసే వరకు ఊరుకునేది లేదు
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైన్స్ కు సహకరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి
వైన్స్ రద్దు చేసే వరకు పోరాటం
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండలో జనావాసాల మధ్య వైన్స్ దుకాణలు నెలకొల్పవద్దని మహిళలు పట్టణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కోరుతున్న ప్రభుత్వ అధికారులు మద్యం వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకొని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దోమకొండ కు కేటాయించిన వైన్స్ దుకాణాలను బీబీపేట రోడ్డులోని జనావాసాల నుండి దూరంగా నెలకొల్పే వరకు ఊరుకునేది లేదని పోరాటం చేస్తామని దోమకొండ మహిళలు, యువత అన్ని వర్గాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజులుగా దోమకొండ యువత, మహిళలు పట్టణ ప్రజలు జనావాసాల మధ్య వైన్స్ వద్దని కోరుతు ఎక్సైజ్ అధికారులు ఇతర శాఖల అధికారులకు డిమాండ్ చేస్తున్నారు. మద్యం వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకొని ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారని దోమకొండ మహిళలు యువత ఆరోపించారు.
ఎక్సైజ్ సీఐ, దోమకొండ పోలీస్, గ్రామపంచాయతీ, రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులకు జనావాసాల మధ్య వైన్స్ ఏర్పాటు చేయవద్దని వినతి పత్రాలు సమర్పించారు. కామారెడ్డి ప్రజావాణిలో కూడా దోమకొండలో జనావాసాల మద్యం దుకాణాలు వద్దని వినతి పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డికి కూడా జనావాసాల మధ్య వైన్స్ వద్దని విన్నవించారు. ఎక్సైజ్ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వైన్స్ దుకాణలు ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని మద్యం వ్యాపారులకు అనుకూలంగా దోమకొండ అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారని దోమకొండ మహిళలు యువత అన్ని వర్గాల ప్రజలు ఆరోపించారు. జనావాసాల మధ్య కాకుండా పట్టణానికి దూరంగా వైన్స్ దుకాణలు ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని మహిళలు యువత భీష్మించుకున్నారు.
ఎంతవరకైనా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. బస్టాప్ ఉండడం, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించడం, స్కూలుకు వెళ్లే పిల్లలకు ఇబ్బందులు కలిగించడం, అన్ని రకాల అసౌకర్యాలు వైన్స్ ద్వారా ఏర్పడుతున్నాయని మహిళలు ఆరోపించారు. దోమకొండ జనావాసాలలో మహిళలు స్కూల్ పిల్లలు బస్సు ప్రయాణికులు మద్యం దుకాణాలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మద్యం వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకుని ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దోమకొండ మహిళలు ఆరోపించారు. పట్టణం బయట, జనావాసులకు దూరంగా దోమకొండ వైన్స్ ఏర్పాటు చేయాలని ముక్తకంఠంతో మహిళలు యువత ప్రజలు కోరుతున్నారు. వైన్స్ ను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.